పాల ట్యాంకర్ను ఢీ కొట్టిన డబుల్ డెక్కర్ బస్సు..18 మంది మృతి

పాల ట్యాంకర్ను ఢీ కొట్టిన డబుల్ డెక్కర్ బస్సు..18 మంది మృతి

ఉత్తర  ప్రదేశ్ లోని ఉన్నావ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  లక్నో ఆగ్రా హైవేపై డబుల్ డెక్కర్ బస్సు,  పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. బీహార్‌లోని సీతామర్హి నుంచి  డబుల్ డెక్కర్  బస్సు ఢిల్లీ వెళ్తుండగా  ఉన్నావ్ దగ్గర ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం దగ్గర చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలు పడి ఉన్నాయి . 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అధికారులు  గాయాలైన వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలను కొనసాగుతున్నాయి.  మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

ఉన్నావ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆవేదన చెంది మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు