చిత్తూరు: భార్యా భర్తల మధ్య జరిగిన గొడవకి ఓ చిన్నారి బలైంది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగింది. గుర్రంకొండ పోలీసుల కథనం ప్రకారం.. రామాపురం పంచాయతీ వంకాయల వారి పల్లె కు చెందిన ఆదీశ్వర అనే వ్యక్తి అదే మండలం నడిమి కండ్రిగ పంచాయతీ చింతమాకులపల్లి కు చెందిన నందిని నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. గత కొంతకాలంగా వారి సంసారంలో గొడవలు జరుగుతుండడంతో నందిని తన పెద్ద కుమార్తె పెద్ద రాజశ్రీని తల్లిదండ్రుల దగ్గర ఉంచి, చిన్న కుమార్తెను తన వెంటే ఉంచుకుంది.
మంగళవారం భార్యాభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదీశ్వర తన చిన్న కుమార్తె కు పురుగుల మందు ఇచ్చి తాను తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. ఆదీశ్వరను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

