కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎవరైనా తుమ్మినా.. దగ్గినా కూడా తోటి వారు తాకడానికే భయపడుతున్నారు. కరోనా ఉందేమో అన్న అనుమానంతో అంటరానివారిలా చూస్తున్నారు. ఈ సమయంలో కరోనా సోకిన చికిత్స పొందుతున్న యువతిపై ఇద్దరు హాస్పిటల్ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. వేధింపులకు పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేశామని గురువారం తెలిపారు పోలీసులు.
గ్రేటర్ నోయిడాలో ఓ ఆస్పత్రిలో ఇటీవలే 20 ఏళ్ల మహిళ.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో నోయిడాలోని శర్ధ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. అక్కడ పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమెపై అక్కడ పని చేసే పారిశుధ్య కార్మికుడు, స్టోర్ కీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ మహిళ ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో లవకుశ్, ప్రవీణ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం ఆ ఉద్యోగులిద్దరినీ ఓ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నామని, వారిని ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పింది.