రెండో రోజు దాడులకు పాల్పడిన పాక్.. 20 ప్రధాన నగరాలను టార్గెట్ చేసి డ్రోన్ల దాడి

రెండో రోజు దాడులకు పాల్పడిన పాక్.. 20 ప్రధాన నగరాలను టార్గెట్ చేసి డ్రోన్ల దాడి

న్యూఢిల్లీ: పాక్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా రెండో రోజు భారత్‎పై దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌, గుజరాత్ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని శుక్రవారం (మే 9) డ్రోన్లతో దాడులకు పాల్పడిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కీలక నగరాలైన జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, జైసల్మేర్, ఫిరోజ్ పూర్, పోఖ్రాన్ వంటి ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది.

అవంతిపుర, పఠాన్ కోట్ ఎయిర్ బేస్‎లతో పాటు.. శ్రీనగర్, జైసల్మేర్ ఎయిర్ పోర్టులపై దాడులకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ క్షణాల్లో పాకిస్థాన్ డ్రోన్లను కాల్చి పడేసింది. మరోవైపు పాక్ ఆర్మీ కాల్పులను  భారత దళాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో వార్ సైరన్లు మోగించి.. పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించారు.   

శుక్రవారం (మే 9) పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్న నగరాలు:

  • అమృత్సర్ (పంజాబ్)
  • పఠాన్‌కోట్ (పంజాబ్)
  • జమ్మూ (జమ్మూ కాశ్మీర్)
  • సాంబా (జమ్మూ కాశ్మీర్)
  • ఫిరోజ్‌పూర్ (పంజాబ్)
  • పోఖ్రాన్ (రాజస్థాన్)
  • కుప్వారా (జమ్మూ కాశ్మీర్)
  • ఉరి (జమ్మూ కాశ్మీర్)
  • పూంచ్ (జమ్మూ కాశ్మీర్)
  • గురుదాస్‌పూర్ (పంజాబ్)
  • హంద్వారా (జమ్మూ కాశ్మీర్)
  • జైసల్మేర్ (రాజస్థాన్)
  • బార్మర్ (రాజస్థాన్)
  • రాజౌరి (జమ్మూ కాశ్మీర్)