కరోనా భయంతో తగ్గిన ఎయిర్ ట్రాఫిక్
భారీగా పెరుగుతున్న ల్యాండింగ్ ఫీజులు
న్యూఢిల్లీ: విమానాలు గాలిలో ఉంటేనే సేఫ్. అవి గనుక నేలమీద ఎక్కువ సేపు ఉంటే చాలా నష్టం. వాటిని నిలిపి ఉంచడానికి సరిపడా పార్కింగ్ ప్లేస్కూడా ఉండదట! ప్రపంచవ్యాప్తంగా రోజూ 20 వేల విమానాలు గాలిలో తిరుగుతుంటాయి. అలా ఉంటేనే రాబడి. లాండింగ్ చేసి ఉంచేస్తే పార్కింగ్ ఫీజు భరించడం కష్టం. యూరోపియన్ హబ్ల్లో ఏ ఎయిర్పోర్టులోనైనా ఒక విమానాన్ని నిలబెడితే గంటకు 285 డాలర్లు (రూపాయల్లో 20 వేల పైమాటే)! . కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి రెండోవారం నుంచే ఎయిర్ ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. కొన్ని ఎయిర్లైన్స్ నామ్కే వాస్తే అన్నట్లుగా విమానాలు నడుపుతున్నాయి.
డెల్టా ఎయిర్లైన్స్వాళ్లు తమ ఫ్లీట్ సర్వీసుల్లో 70 శాతం తగ్గించేసుకుంది. తమ విమానాల్లో 600కి పైగా పార్కింగ్ చేసింది. పాత విమానాలకు రిటైర్మెంట్ ఇచ్చేయాలనికూడా అనుకుంటోంది. ఆస్ట్రేలియాకి చెందిన ఖ్వాంటస్ తాత్కాలికంగా 150 విమానాలు ఆపేసింది. వాటికి పార్కింగ్ ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని ఎయిర్పోర్టు అథారిటీలతోనూ, ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతోంది. జర్మనీలో లుఫ్తాన్సా గ్రూప్ ఏకంగా 90 శాతం సీటింగ్ కెపాసిటీని తగ్గించుకుంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 24 వరకు షార్ట్, మీడియం, లాంగ్ జర్నీ విమానాలపై కంట్రోల్ పెట్టుకుంది. దాదాపుగా 23 వేల ట్రిప్పులు క్యాన్సిల్ చేసేసింది.
ఇదేదో జనతా కర్ఫ్యూ వల్లనే ఏర్పడ్డ పరిస్థితి అనుకోకూడదని ఎయిర్లైన్స్ వర్గాలు అంటున్నాయి. గడచిన మూడు వారాలుగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సగానికి, డొమెస్టిక్ సర్వీసులు 15 శాతానికి పడిపోయాయి. సాధారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి నెలకు 61 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కరోనా వైరస్ వార్తలు వచ్చినప్పటినుంచీ చాలామటుకు తగ్గిపోయింది. సోమవారం(23వ తేదీ) నుంచి ఇంటర్నేషనల్ విమానాల రాకపోకలు నిలిపేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో… ఆదివారం ఎక్కువగా బయటి దేశాల ప్యాసింజర్లు వచ్చేశారు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ ఎయిర్పోర్టులో తాకిడి పెరిగిపోయింది.

