తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరానికి భారీగా డ్రగ్స్ కొట్టుకొచ్చాయి. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రపు ఒడ్డున ఓ డ్రమ్లో చైనా భాషలో రాసి ఉన్న కవర్లను గమనించారు స్థానికులు. ఈ కవర్లలో టీ పొడి లాంటి పదార్థం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా.. డ్రగ్స్ అని తేలింది. ప్యాకెట్లలో ఉన్న పొడిని మెథా బయోటిన్ డ్రగ్గా గుర్తించింది తమిళనాడు నార్కోటిక్ విభాగం.
డ్రగ్ డీలర్లు చైనా నుంచి వీటిని షిప్పుల్లో తెచ్చి ఎవరికీ కనిపించకుండా డ్రమ్ములకి తాళ్లు కట్టి నీళ్లలోంచి బయటకు తీసి తీసుకెళ్తుండగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మహాబలిపురానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుండటంతో ఈ ప్రాంతంలో యథేచ్ఛగా డ్రగ్స్ ను విక్రయిస్తుంటారు. డ్రగ్స్ దొరికిన డ్రమ్ము ఎలా వచ్చిందన్న దాని మీద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.