నేడు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా చర్చలు
న్యూఢిల్లీ: రాబోయే రెండు ఏళ్లలో జరగాల్సిన రెండు టీ20 వరల్డ్ కప్స్కు ఎవరు ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వాలన్న దానిపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చర్చించనున్నాయి. శుక్రవారం జరిగే ఐసీసీ మీటింగ్ సందర్భంగా ఈ చర్చ జరగనుంది. ఈ రెండు బోర్డులు తీసుకోబోయే నిర్ణయం.. ఐసీసీ కొత్త చైర్మన్ ఎంపికపై కూడా ప్రభావం చూపనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా, సీఏ చీఫ్ ఎర్ల్ ఎడ్డింగ్స్, నిక్ హాక్లీ ఈ మీటింగ్ లో పాల్గొ ననున్నారు. 2021, 2022 మెగా టోర్నీలకు ఎవరు హోస్టింగ్ ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. ‘న్యూజిలాండ్ లో వుమెన్స్ వన్డే వరల్డ్ కప్తో పాటు ఇతర ఐసీసీ టోర్నీలపై చర్చించాలన్నది ప్రధాన ఎజెండా. అందులో భాగంగా టీ20 వరల్డ్ కప్స్పై డిస్కషన్ జరగనుంది. హోస్టింగ్ రైట్స్ను స్వాపింగ్ చేసుకుంటారా? లేక పాత షెడ్యూల్కే కట్టుబడి ఉంటారా? అన్నది తేలనుంది’ అని ఐసీసీ మెంబర్ ఒకరు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆసీస్ లో, వచ్చే ఏడాది ఇండియాలో టీ20 వరల్డ్ కప్స్ జరగాల్సి ఉన్నాయి. కానీ కరోనా నేపథ్యంలో ఆసీస్ లో మెగా ఈవెంట్ ను ఐసీసీ పోస్ట్పోన్ చేయడంతో గందరగోళం మొదలైంది. ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన తాము రెండేళ్ల వరకు టోర్నీని నిర్వహించకుండా ఉండలేమని చెబుతున్న సీఏ.. వచ్చే ఏడాది రైట్స్ను తమకు ఇవ్వాలని కోరుతోంది. మరి దీనికి బీసీసీఐ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.