
- 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా..
- తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి చోటు
న్యూఢిల్లీ, వెలుగు: వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసింది. మొత్తం 31 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయగా..అం దులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ఇద్దరికి కమిటీలో అవకాశం లభించింది. లోక్ సభ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. అలాగే ఏపీలోని నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకు చోటు దక్కింది. రాజ్యసభ నుంచి వైసీపీ సభ్యుడు విజ య సాయిరెడ్డిని కమిటీలో చేర్చారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు లోక్సభలో జేపీసీ సభ్యులకు సంబంధించి ప్రకటన చేశారు.
లోక్ సభ సభ్యులు వీరే..
కిరణ్ రిజుజు జేపీసీ సభ్యులకు సంబంధించి కేంద్ర ప్రతిపాదనను లోక్సభలో ప్రవేశపెట్టారు. అందులో బీజేపీ ఎంపీలు జగదాంబికా పా ల్, నిషికాంత్ దూబే, తేజస్వీ సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిజిత్ గంగోపాధ్యాయ, డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్, ఎస్పీ ఎంపీ మౌలానా మొహిబుల్లా నాద్వీ, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, డీఎంకే ఎంపీ ఎ.రాజా, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జేడీయూ ఎంపీ దిలేశ్వర్ కమైత్, శివసేన (ఠాక్రే) ఎంపీ అరవింద్ సావంత్, ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సురేశ్ గోపీనాథ్, శివసేన (షిండే) నరేశ్ గణపత్, ఎల్జేపీ ఎంపీ అరుణ్ భారతి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది. జేపీసీ సమావేశానికి కోరం మొత్తం సభ్యుల్లో మూడో వంతు ఉండాలి. వచ్చే సమావేశాల్లో మొదటి వారం చివరి రోజున కమిటీ రిపోర్టును సభలో ప్రవేశపెట్టనున్నట్లు రిజుజు పేర్కొన్నారు.