- 18 ఆయుధాలను బస్తర్ ఐజీకి అప్పగింత
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కేంద్రంలో ఆదివారం 21 మంది మావోయిస్టులు తమ వద్ద ఉన్న 18 ఆయుధాలతో సహా బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి ఎదుట లొంగిపోయారు. బస్తర్ పరిధిలోని కేశ్కాల్ డివిజన్లో ఉన్న క్యూమరి, కిస్కోడ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు నార్త్ సబ్ డివిజనల్ బ్యూరో సెక్రటరీ ముఖేశ్ నేతృత్వంలో ఆయుధాలతో సహా వచ్చారు.
లొంగిపోయిన వారిలో నలుగురు డివిజనల్, తొమ్మిది మంది ఏరియా కమిటీ, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మూడు ఏకె-47లు, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్ షాట్ గన్స్, ఒక బీజీఎల్ వెపన్ను ఐజీకి అప్పగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ఐజీ వెల్లడించారు. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
