
- పంట ఉత్పత్తులు పెంచడం, గిట్టుబాటు ధరకు అమ్మడమే లక్ష్యం
కామారెడ్డి, వెలుగు: రైతులకు మెరుగైన సేవలు, పంట ఉత్పత్తుల పెంపు, అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్లు)ను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు( రైతు ఉత్పత్తిదారుల సంస్థలు–ఎఫ్పీవోలు)గా మారుస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉండగా మొదటి విడతలో 22 ఎఫ్పీవోలుగా మారాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. ఆయా సంఘాల్లో ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యకలాపాలతో పాటు ఎఫ్పీవో పనులు కూడా చేపట్టనున్నారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను విస్తరించడం దీని ముఖ్య ఉద్దేశం. నిర్వహణకు ఫండ్స్ఇవ్వడంతోపాటు వ్యాపార లావాదేవీలకు కేంద్రం ఒక్కో సొసైటీకి రూ.15 లక్షల షేర్క్యాపిటల్ఇస్తుంది. దీనికి సమానంగా రైతులు షేర్ క్యాపిటల్పెట్టాలి. త్వరలోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ఆర్గనైజేషన్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
500 మందికి తక్కువ కాకుండా సభ్యులు
ఒక్కో ఎఫ్పీవోలో 500 మందికి తక్కువ కాకుండా రైతులు సభ్యులుగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే షేర్ క్యాపిటల్అనుగుణంగా వీరు రూ.15 లక్షల వరకు షేర్ క్యాపిటల్ పెట్టాలి. ఈ అమౌంట్ను సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నిర్ణయిస్తారు. దీనితో పంట ఉత్పత్తులు పెంచే కార్యక్రమాలు నిర్వహించడం, శిక్షణ, ప్రాసెసింగ్, ఉత్పత్తుల కొనుగోళ్లు వంటివి చేపడుతారు. వ్యవసాయంలో వచ్చే మార్పులు, టెక్నాలజీ ఉపయోగించి పంట ఉత్పత్తులను పెంచేందుకు ఎఫ్పీవోలు పని చేస్తాయి. గిట్టుబాటు ధరకు వాటిని విక్రయించి, రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయనున్నారు.
ఎఫ్పీవోలుగా మారిన సొసైటీలు ఇవే..
జిల్లాలో ప్రస్తుతం 55 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో నుంచి మొదటి విడతలో 22 సొసైటీలను ఫార్మర్ ప్రొడ్యూసర్ఆర్గనైజేషన్లుగా మారాయి. అవి కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు మండలం జంగంపల్లి, బీబీపేట, రాజంపేట మండలం ఆర్గొండ, సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలం తాండూర్, బీర్కుర్, జుక్కల్, పిట్లం మండలంలోని చిల్లర్గి, దోమకొండ, బాన్సువాడ, డొంగ్లి, నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి, పెద్దకొడప్గల్, మహమ్మద్ నగర్ మండలంలోని గున్గుల్ సంఘాలు.
రైతులకు ఎంతో మేలు
ఇప్పుడున్న సొసైటీలకు అనుబంధంగా ఎఫ్పీవోల కార్యకలాపాలు కొనసాగుతాయి. వీటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఫండ్స్ తదితర వ్యవహారాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. పంట ఉత్పత్తులను పెంచేలా రైతులకు ట్రైనింగ్ఇస్తారు. – రామ్మోహన్, జిల్లా సహకార అధికారి