న్యూఢిల్లీ : మనదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఈక్విటీ ఇన్ఫ్లో ఈ ఏడాది ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య 24 శాతం తగ్గి 20.48 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్, టెలికాం, ఆటో, ఫార్మాలో ఇన్ఫ్లోలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎఫ్డీఐ ఇన్ఫ్లోలు 26.91 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి–-మార్చిలో ఇన్ఫ్లోలు కూడా 40.55 శాతం తగ్గి 9.28 బిలియన్ల డాలర్లకు చేరాయి. గతేడాది ఏప్రిల్–-జూన్ మధ్యకాలంలో ఇవి 34 శాతం క్షీణించి 10.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విదేశీ పెట్టుబడులు తగ్గాయి. అయితే, సెప్టెంబర్లో వీటి విలువ 4.08 బిలియన్ డాలర్లకు పెరిగింది.
గత ఏడాది సెప్టెంబరులో 2.97 బిలియన్ డాలర్ల విలువైన ఇన్ఫ్లో ఉందని డిపార్ట్మెంట్ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) తెలిపింది. మొత్తం ఎఫ్డీఐ -- ఈక్విటీ ఇన్ఫ్లోలు.. అంటే రీఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు, ఇతర మూలధనం గత ఏడాది ఏప్రిల్–జూన్లో వార్షికంగా38.94 బిలియన్ డాలర్ల నుంచి 32.9 బిలియన్ల డాలర్లకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, సింగపూర్, మారిషస్, యూఎస్, యూకే, యూఏఈ సహా ప్రధాన దేశాల నుంచి ఎఫ్డీఐ ఈక్విటీ ఇన్ఫ్లోలు తగ్గాయి. ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య కేమన్ దీవులు, సైప్రస్ నుంచి కూడా ఇన్ఫ్లోలు తగ్గాయి. అయితే, నెదర్లాండ్స్, జపాన్ జర్మనీ నుంచి ఇన్ ఫ్లోలు పెరిగాయి. రంగాల వారీగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్, ట్రేడింగ్, సర్వీసెస్, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఫార్మా కెమికల్స్లో ఇన్ఫ్లోలు తగ్గాయి.
నిర్మాణ (మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, నిర్మాణ అభివృద్ధి, మెటలర్జికల్ పరిశ్రమ ఇన్ ఫ్లోలలో వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర అత్యధికంగా 7.95 బిలియన్ల డాలర్లను పొందినప్పటికీ, గత సంవత్సరం ఇదే కాలంలో 8 బిలియన్ల డాలర్లు వచ్చాయి. కర్ణాటకలో విదేశీ ఇన్ఫ్లోలు గత ఏడాది ఇదే కాలంలో 5.32 బిలియన్ల డాలర్ల నుంచి ఏప్రిల్-–సెప్టెంబర్ లో 2.84 బిలియన్ల డాలర్లకు పడిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలకూ ఎఫ్డీఐలు తగ్గాయి. తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఎఫ్డీఐలు పెరిగాయి. 2022–-23లో భారతదేశంలోకి ఎఫ్డీఐ ఈక్విటీ ఇన్ఫ్లో 22 శాతం తగ్గి 46 బిలియన్ డాలర్లకు చేరుకుంది.