
గండిపేట్,వెలుగు: రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు రాజేంద్రనగర్ పోలీసులు అందజేశారు. చోరీ అయిన 24 మొబైల్స్ ను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ రూ.4.51లక్షలు ఉంటుంది. బుధవారం రాజేంద్రనగర్ పీఎస్ లో మీడియా సమావేశం నిర్వహించి ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. మొబైల్, పరికరాల చోరీలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీవోటీ) సీఈఐఆర్ పోర్టల్ను డెవలప్ చేసిందని తెలిపారు. పోర్టల్ సేవలు 2023 మే లో దేశవ్యాప్తంగా అమలు లోకి వచ్చాయని పేర్కొన్నారు. మొబైల్స్ పోయినట్లయితే ప్రజలు.. సైబర్ క్రైమ్కు కంప్లయింట్ చేయాలని సూచించారు. లేదా 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయాలని, ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పని చేస్తుందని చెప్పారు. రాజేంద్రనగర్ డీఐ గంగాధర్ ఆధ్వర్యంలో టీమ్ టి.నర్సింహులు, పీసీలు డీఎస్ రాజు, బాలకృష్ణ, మహేందర్, శంకరయ్య, రఫీక్, అనిల్ ఆధ్వర్యంలో ఏసీపీ టి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కె.క్యాస్ట్రో సమక్షంలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు.