బషీర్ బాగ్, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో శనివారం భారీగా నగదు పట్టుబడింది. రాత్రి 9 గంటల సమయంలో జైన్ మందిర్ నుంచి విష్ణు ఫైర్ వర్స్క్ వైపు హోండా యాక్టివాపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తనిఖీలను గమనించి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సూరకంటి కిరణ్ రెడ్డి (30), కల్లెం జంగారెడ్డి (34) అనే వ్యక్తుల బ్యాగ్ను చెక్ చేయగా రూ. 25 లక్షలు దొరికాయి. దీనికి వారు సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును పోలీసులు సీజ్ చేశారు. డబ్బులు తరలిస్తున్న ఇద్దరితో పాటు నగదును బషీర్ బాగ్ అయాకర్ భవన్లోని ఇన్కం టాక్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ ముందు ప్రవేశ పెట్టినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
స్కూటీలో రూ 2.93 లక్షలు తీసుకెళ్తుండగా..
వికారాబాద్ : స్కూటీలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదును తాండూరు మండలం, కరణ్ కోట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కరణ్ కోట ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు సీసీఐ కాలనీలో నివాసముండే మహమ్మద్ ఆనాజ్ అనే వ్యక్తి తాండూరు నుంచి గౌతాపూర్ వైపు స్కూటీపై వస్తున్నాడు. గౌతాపూర్ వద్ద తనిఖీలు నిర్వహించగా అతని వద్ద అనుమతులు లేకుండా 2 లక్షల 93 వేల 830 రూపాయలు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా నగదును తరలిస్తుండడంతో వాటిని సీజ్ చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీకి తరలించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రూ. 50 వేలకు మించి నగదును తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.