- హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయొద్దంటూ అటాక్
- హాస్టల్ రూమ్స్, బైక్స్ ధ్వంసం
- ఇద్దరు విద్యార్థులకు గాయాలు
- 25 మందిపై కేసు.. ఇద్దరు అరెస్టు
అహ్మదాబాద్: గుజరాత్లో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్లపై శనివారం రాత్రి కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 నుంచి 25 మంది గుంపుగా వచ్చి స్టూడెంట్లపై అటాక్ చేశారు. విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తుండగా.. హాస్టల్లో నమాజ్ చేయొద్దని, మసీదులో చేసుకోవాలంటూ ఆ గుంపు దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు స్టూడెంట్లు గాయపడ్డారు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేసు దర్యాప్తుకు 9 టీమ్స్..
ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ‘‘గుజరాత్ వర్సిటీలో అఫ్గానిస్తాన్, తజికిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా దేశాలకు చెందిన దాదాపు 300 మంది చదువుకుంటున్నారు. వీరిలో 75 మంది ఏ–బ్లాక్ హాస్టల్లో ఉంటున్నారు. శనివారం రాత్రి 10:50 గంటల టైమ్లో నమాజ్ చేసుకునేందుకు ఒక్కచోటకు చేరారు. అదే టైమ్లో 20-- నుంచి 25 మంది దుండగులు హాస్టల్లోకి చొరబడ్డారు.
హాస్టల్లో నమాజ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. విదేశీ విద్యార్థులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టారు.. రాళ్లు విసిరారు. వాళ్లుండే రూమ్స్, బైక్స్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో శ్రీలంక, తజికిస్తాన్కు చెందిన ఇద్దరు స్టూడెంట్లు గాయపడ్డారు. వాళ్లను ఆస్పత్రిలో చేర్పించాం” అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 25 మంది దుండగులపై కేసు పెట్టి, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తు కోసం 9 టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటం: కేంద్రం
‘గుజరాత్ వర్సిటీలో జరిగిన ఘటనలో ఇద్దరు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిందితులపై గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు.