- రిపేర్చేసి, విద్యుత్సరఫరా పునరుద్ధరించిన టీజీఎస్పీడీఎల్ అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ పోల్స్ విరిగిపడ్డాయి. దీంతో సిటీలో కొన్నిచోట్ల రాత్రి పూట కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లలో కలిపి మొత్తం 253(11 కేవీ) ఫీడర్లు దెబ్బతిన్నాయి. 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్) పాడయ్యాయి.
రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీలో 6 (33 కేవీ) ఫీడర్లు నిలిచిపోయాయి. అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోనే 117 ఫీడర్లు, 21 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన టీజీఎస్పీడీఎల్ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రభావితమైన 6 (33 కేవీ) ఫీడర్లు, 253 (11 కేవీ) ఫీడర్లు, 44 ట్రాన్స్ఫార్మర్లన్నింటినీ 100 శాతం పునరుద్ధరించి, విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభించారు. గాలుల ధాటికి వివిధ సర్కిళ్లలో విరిగిపడిన విద్యుత్ స్తంభాల రెక్టిఫికేషన్ పనులు కూడా పూర్తి చేసినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.
అధికారులు అన్నిచోట్లా కరెంట్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్లను రిపేర్ చేసినట్లు చెప్పినప్పటికీ కొన్నిచోట్ల విద్యుత్ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్నగర్ కుందన్ టవర్స్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 16 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
