కొత్త ప్రదేశాలు చూడాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలని సెలవులు పెట్టి నెలకో, సంవత్సరానికో టూర్స్ వెళ్తుంటారు కొందరు. కానీ, మధ్యప్రదేశ్లోని ఈ జంట మాత్రం అలా కాదు. ట్రావెలింగ్ మీద ఉన్న ప్యాషన్తో చేస్తున్న జాబ్ వదిలేసి, కాలినడకన ఊరూరు తిరుగుతున్నారు. ఈ మధ్యే కాలినడకన 3,200 కిలోమీటర్ల టూర్ పూర్తి చేశారు. టూరిజాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని క్యాంపెయిన్ చేస్తున్నారు. నిఖిల్ సవ్లాపూర్కర్, పరిధి గుప్తా.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి చెందినవాళ్లు. భార్యాభర్తలిద్దరూ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేసేవాళ్లు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలవరకు జాబ్ చేయడం, రిలీఫ్ కోసం వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే లైఫ్ బోర్ కొట్టింది. అందుకే కొన్ని రోజులు లీవ్ పెట్టి కార్లో టూర్కి వెళ్లారు. ఆ టూర్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ టూర్లో ‘టూరిజాన్ని, పర్యావరణాన్ని ఎవరూ పట్టించుకోవట్లేద’ని తెలుసుకున్నారు. మనాలి, లఢఖ్, శ్రీనగర్లతో పాటు అక్కడి ప్రాంతాలని కాలినడకన చుట్టేశారు. మొత్తం 3,200 కిలోమీటర్లు తిరిగారు.
కార్తో చేసిన టూర్లో లైఫ్ అంటే ఏంటి? ఎలా బతకాలి? అనే విషయాలు తెలుసుకున్నారు. లైఫ్ టైం మెమరీ టూర్ల వల్లే వస్తుందని ఇద్దరు జాబ్ మానేశారు. ఈ టూర్కోసం ప్రిపేర్ అయ్యారు. ప్రతిరోజూ రన్నింగ్, యోగా, ఎక్సర్సైజ్లు చేశారు. మంచు, కొండ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎలా తట్టుకోవాలో నేర్చుకున్నారు. భుజానికి 50 కిలోల బరువుండే బ్యాగ్ తగిలించు కొని వాళ్ల అపార్ట్మెంట్లోని ఐదు ఫ్లోర్లు ఎక్కి దిగుతూ బరువులు మోయడం ప్రాక్టీస్ చేశారు.
ఏప్రిల్ నెలలో మనాలిలోని ప్రిని నుంచి మొదలైన వీళ్ల జర్నీ.. లెహ్లోని సియాచిన్ బేస్ క్యాంప్ మీదుగా శ్రీనగర్ చేరింది. శ్రీనగర్నుంచి లింగ్షేడ్, కార్గిల్లని తిరుగుతూ టూరిజం, నేచర్ గురించి క్యాంపెయిన్ చేశారు. మధ్యలో కొన్ని రోజులు లఢఖ్లోని టార్ ఊళ్లో బ్రేక్ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే రోజు యాత్రని ముగించారు. ఊళ్లన్నీ తిరుగుతూ ప్రజలకు, టూరిస్టులకు అక్కడి టూరిజంని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేవాళ్లు. మళ్లీ నవంబర్లో లఢఖ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు ఈ జంట.
‘కొండలు, వంపులు తిరిగిన రోడ్లు, మంచు పర్వతాల్లో నడుస్తున్నప్పుడు ఎలుగుబంట్లు ఎదురయ్యేవి. చల్లని వాతావరణం ఇబ్బంది పెట్టేది. అయినా, మేం భయపడలేదు. ఎక్కువగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటూ ఫిట్నెస్ పెంచుకున్నాం. అక్కడి ప్రజలు మమ్మల్ని ఇంటికి పిలిచి ఆశ్రయం ఇచ్చేవాళ్లు. ఎన్ని రోజులున్నా అభ్యంతరం చెప్పేవాళ్లుకాదు. అది ఒక మంచి ఎక్స్ పీరియెన్స్’ అని చెప్తున్నారు నిఖిల్, పరిధి.