
రోజూ గ్రేటర్లోనే 30 నుంచి 50 కేసులు
85 శాతం కేసులను ట్రేస్ చేస్తున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 353 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కమిషనరేట్స్ పరిధిలో 201 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో రోజూ 75 వరకు మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇందులో గ్రేటర్ పరిధిలోనే 30 నుంచి 50 మంది కనిపించకుండా పోతున్నారు. 15 ఏండ్ల లోపు పిల్లలు, యువతులు కనిపించకుండా పోతే పేరెంట్స్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో.. కుటుంబ కలహాలు, ప్రేమ, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు.
ప్రేమ వ్యవహారాలతో టీనేజ్ అమ్మాయిలు
ఏటా 60 శాతం కేసుల్లో టీనేజ్ అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు పోలీస్ కేస్ స్టడీస్ చెబుతున్నాయి. ప్రేమ పెండ్లి చేసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 20 శాతం మంది మహిళలు కుటుంబ కలహాలతో వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరో 10 % మంది 60 ఏండ్ల పై బడిన వృద్ధులు కనిపించకుండా పోతున్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. పిల్లలు తమను సరిగా చూడటంలేదని ఇంట్లోంచి వెళ్లిపో తున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అయితే మొత్తంగా 85% కేసులు ట్రేస్ అవుతున్నాయి.
గ్రేటర్లో మూడు రోజుల్లో..
గురు, శుక్ర, శనివారాల్లో గ్రేటర్లో 76 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 33 మంది మహిళలు, 22 మంది మైనర్లు, 21 మంది పురుషుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 50 కేసులను పోలీసులు ట్రేస్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కనిపించకుండా పోయిన ముగ్గురు యువతులను సురక్షితంగా ఇండ్లకు చేర్చారు. గురువారం రాత్రి ట్యాంక్బండ్ చూసేందుకు వెళ్లిన ఇద్దరు యువతులు శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటర్వ్యూ కోసమని వెళ్లిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హయత్నగర్ పీఎస్లో రిజిస్టర్ అయిన చిన్నారుల మిస్సింగ్ కేసులో కుటుంబ కలహాలతో తండ్రే పిల్లలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
For More News..