ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 36వేల అప్లికేషన్లు పెండింగ్

ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 36వేల అప్లికేషన్లు పెండింగ్
  • సారూ.. మాకేది ఆసరా!
  • ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 36వేల అప్లికేషన్లు పెండింగ్
  • ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులు, పట్టించుకోని ఆఫీసర్లు
  • రెండేళ్లగా ఎదురుచూపులే..!


ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు సుగుణ. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణానికి చెందిన ఈమె భర్త చనిపోయి రెండేళ్లు అయ్యింది. వితంతు పింఛన్‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పటి వరకు మూడు సార్లు దరఖాస్తు చేసుకుంది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. పెన్షన్ రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగితే వచ్చినప్పుడు ఇస్తాం.. అంటూ చీదరించు కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఒక్క సుగుణనే కాదు జిల్లాలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది..

నిజామాబాద్, వెలుగు:  ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్లు ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అర్హులకు దక్కడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  కొత్తగా 1.15 లక్షలు మంది పింఛన్‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందులో 36 వేల అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. నిత్యం అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పింఛన్‌‌‌‌‌‌‌‌ కోసం మున్సిపల్, ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

కొత్తగా 48 వేల మందికి..

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను తెచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 2,39,394 మంది, కామారెడ్డి జిల్లాలో 82,548 మందికి పింఛన్లు అందిస్తోంది. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రెండో సారి అధికారంలోకి వచ్చాక మరోసారి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు కోరింది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటి వరకు వరకు 1.15 లక్షల మంది వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుండగా 2022 జూన్‌‌‌‌‌‌‌‌లో 12,500 మందికి మాత్రమే మంజూరు చేశారు. తాజాగా జిల్లా వ్యాప్తంగా 48  వేల పింఛన్లు మంజూరు చేయగా నిజామాబాద్ అర్బన్‌‌‌‌‌‌‌‌లో 8,500 మంది, ఆర్మూర్ 7,888, బాల్కొండ 9,600, బాన్సువాడ 4,986, బోధన్ 8,926, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  8,945 మంది ఉన్నారు. జిల్లాలో ఇంకా 26 వేల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఇందులో వయస్సు కుదింపులో 14 వేల అప్లికేషన్లు ఉన్నాయి.  కామారెడ్డి జిల్లాలో  50 వేల మంది పింఛన్లకు దరఖాస్తు చేయగా వారిలో 31,104 వేల మందికి మంజూరయ్యాయి. పింఛన్లు రాని వారు రోజూ మున్సిపల్, ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. తామేమి చేయలేమని సిబ్బంది వారిని వెనక్కి పంపుతున్నారు.  

57 ఏళ్ల పింఛన్లకు మొండిచేయి... 

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మరోసారి అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌దారుల వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల దగ్గర పడుతున్నా  57 వయస్సు ఉన్న 20 వేల మంది దరఖాస్తుదారులకు ఇప్పటి వరకు పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. నెలన్నర కింద పింఛన్ల మంజూరైన వాటిలో కేవలం 30 శాతం లోపు దరఖాస్తుదారులు ఎంపికయ్యారు.  జిల్లాలో వయస్సు కుదింపు పింఛన్‌‌‌‌‌‌‌‌లో సుమారు 14  వేల మంది వరకు దరఖాస్తు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.