- అంత్యక్రియలు చేశాక పోస్టుమార్టం
కోటగిరి, వెలుగు: పోతంగల్ చెక్పోస్ట్లోని కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ నెలరోజులపాటు మృత్యువుతో పోరాడి మృతిచెందింది. కోటగిరి మండలానికి చెందిన రేణి మొగులవ్వ(40) ఫిబ్రవరి 15న మిల్లులో పని చేస్తుండగా మెషీన్ బెల్ట్లో చీర చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు.
దీంతో అధికారులు సోమవారం తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మళ్లీ అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైస్మిల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు.
