సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనే చాలామంది బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటారు. తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు లోన్ మనీ పెట్టి తమకు నట్టినట్టు ఇంటిని డిజైన్ చేయించుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్రం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు లోన్ మంజూరు చేస్తోంది. అయితే.. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో కొంత మంది మహిళలు ఇంటి కోసం అని లోన్ తీసుకుని భర్తలను వదిలి లవర్స్తో చెక్కేశారు.
బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న.. 40 మంది మహిళలకు రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఇటీవల ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ.50 వేల చొప్పున జమచేశారు. ఇదే వారి భర్తల పాలిట శాపంగా మారింది. ఈ పథకం కింద రుణాలు పొందిన 40 మందిలో నలుగురు మహిళలు కనిపించకుండా పోయారు. వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ.50 వేలు కూడా మాయమయ్యాయి. భర్తలు వారి కోసం ఆరా తీయగా భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పారిపోయినట్లు తేలింది. ఇలా పారిపోయిన వాళ్లలో బెల్హారా, బాంకీ, జైదాపూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లోన్ తీసుకుని భార్యలు పరార్ కావడంతో భర్తలు లబోదిబోమంటున్నారు. బాధిత భర్తలు జిల్లా కేంద్రంలోని సంబంధిత అధికారులను ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు పారిపోయారని, మిగతా నిధులనైనా వారి ఖాతాల్లో వేయకుండా నిలిపివేయాలని మొరపెట్టుకున్నారు.