
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో సుమారు రూ.40 కోట్ల విలువైన 40.2 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ మహిళా ప్యాసింజర్ ఈ గంజాయిని తీసుకొచ్చింది. ఎన్సీబీ అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ మహిళా ప్రయాణికురాలు 40.2 కేజీల హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.40 కోట్ల విలువైనదని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన మహిళను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు.. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.