
హైదరాబాద్ సిటీ, వెలుగు: అనుమతులు లేని లేఅవుట్లలో రహదారులు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని హైడ్రాలో ఫిర్యాదులు వచ్చాయి. డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఖాళీ చేయమంటే దాడి చేస్తున్నారంటూ పలువురు కంప్లయింట్ ఇచ్చారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వీకరించారు. అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు.
హెచ్ ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఔట్లలో ప్లాట్లు కొంటే రహదారులు, పార్కులు నిర్దేశిత లెక్కల ప్రకారం ఉంటాయన్నారు. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్ రిచ్ ప్రాంతంలో వరకుంట చెరువు, బాచుపల్లి మండలంలోని నిజాంపేటలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మొత్తంగా హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులందాయి. ఇందులో ఎక్కువగా రహదారులు, పార్కుల ఆక్రమణలే ఉన్నాయి.