
- కేటీఆర్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో ఒకే నెలలో 48 మంది పిల్లలు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదంతా ఊహించుకుంటేనే తనకు ఒళ్లు జలదరిస్తోందని అని అన్నారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘48 మంది పసిగుడ్డులు.. 14 మంది బాలింతలు.. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పని చేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది” అని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు అవేవీ ఇవ్వడం లేదని, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని కామెంట్ చేశారు.