యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు
  • ధర్మదర్శనానికి 5, స్పెషల్ దర్శనానికి రెండున్నర గంటలు
  • వాహనాల రద్దీతో భక్తుల ఇక్కట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి శనివారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు. కొండపైకి ప్రైవేట్ వెహికల్స్​ అనుమతించకపోవడం, ఆలయ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. రద్దీని గమనించిన ఆర్టీసీ అదనపు బస్సులను నడిపినా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు రూ. 500 టికెట్ పై గుట్టపైకి అనుమతించిన భక్తుల కార్లతో కొండపైన బస్ బే ప్రాంగణం నిండిపోవడంతో ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక గంటల తరబడి సతమతమయ్యారు. చివరకు పాత ఘాట్ రోడ్డులో హరిత హోటల్ వరకు పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ స్థలం కూడా సరిపోకపోవడంతో.. కొండపైకి వెహికల్స్​ను ​నిలిపివేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. 

నిండిపోయిన క్యూలైన్లు

భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. దర్శన క్యూలైన్లు నిండిపోవడంతో ఆలయ ఆఫీసర్లు క్యూకాంప్లెక్స్​లో భక్తులను ఆపాల్సి వచ్చింది. వీఐపీ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు కూడా గంటల తరబడి వెయిట్ చేశారు. వీఐపీ క్యూలైన్లు ఫుల్ కావడంతో ప్రధానాలయ తూర్పు రాజగోపురం నుంచి పశ్చిమ రాజగోపురం వరకు అష్టభుజి ప్రాకార మండపాల్లో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఆలయంలోకి పంపారు. రద్దీ కారణంగా ధర్మదర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. మరోవైపు భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శనివారం రూ.40,29,719 ఇన్ కం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.14,84,300, కొండపైకి వెహికల్స్​ప్రవేశం ద్వారా రూ.7.5 లక్షలు, వీఐపీ టికెట్ల విక్రయంతో రూ.4.80 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4.64 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.