ఢిల్లీలో 500 మంది సెక్యూరిటీ ఫోర్స్‌కు కరోనా

ఢిల్లీలో 500 మంది సెక్యూరిటీ ఫోర్స్‌కు కరోనా
  • అందరూ కరోనా డ్యూటీలో ఉన్నవారే
  • మర్కజ్‌ కేసు విచారణ చేసిన వారికీ వైరస్‌
  • బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో 195 మందికి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు కష్టపడుతున్న ఫ్రెంట్‌లైన్‌ వర్కర్స్‌లో పొలీసులు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. మన కోసం డ్యూటీ చేస్తున్న వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 500 మంది సెక్యూరిటీ ఫోర్స్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వాళ్లంతా ఢిల్లీలో డ్యూటీ చేసిన వాళ్లే అని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సెంట్రల్‌, సౌత్‌ ఈస్ట్‌, నార్త్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఆ పరిధిలోని అన్ని యూనిట్లను మానిటరింగ్‌ చేస్తున్నామని అధికారులు చెప్పారు. బోర్డర్‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌లోనే అత్యధికంగా 195 మంది జవాన్లకు వైరస్‌ సోకింది. వాళ్లంతా ఢిల్లీకి లింక్‌ ఉన్నావారే. కరోనా సోకి గురువారం ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు చనిపోయారు. “ ప్రస్తుతం 191 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వాటిలో దాదాపు 130 కేసులు ఢిల్లీతో లింక్‌ ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌‌ విషయంలో ఢిల్లీ పోలీసులతో కలిసి పనిచేసిన వారికి చాలా వరకు వైరస్‌ సోకింది” అని బీఎస్‌ఎఫ్‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ తర్వాత సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌‌పీఎఫ్‌)లోని 159 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. సీఆర్‌‌పీఎఫ్‌కు చెందిన 900 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. “ కేంద్ర హోం మినిస్ట్రీలో పనిచేస్తున్న డ్రైవర్‌‌, కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వాళ్లతో కాంటాక్ట్‌ అయిన వాళ్లను ట్రేస్‌ చేసి క్వారంటైన్‌ చేశాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం” అని సీఆర్‌‌పీఎఫ్‌ అధికారి చెప్పారు. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

ఐటీబీపీలో 82 మందికి

‘ది ఇండో టిబెటిన్‌ బోర్డర్‌‌ పోలీస్‌’ కు చెందిన 82 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వారిలో 8 మంది ఢిల్లీ పోలీసులతో కలిసి పనిచేశారని అధికారులు చెప్పారు. ఢిల్లీ పోలీసులకు 80 మందికి కరోనా వైరస్‌ సోకింది.“ సెంట్రల ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌” కు చెందిన 50 మందికి కరోనా వచ్చింది. కాగా.. ఎస్‌ఎస్‌బీకి చెందిన వారికి 14 మందికి పాజిటివ్‌ వచ్చిందని, ఇదే తక్కువ సంఖ్య అని అధికారులు చెప్పారు. వాళ్లంతా ఢిల్లీ పోలీసులతో కలిసి డ్యూటీ చేసిన వారే అని ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్‌‌ జనరల్‌ రాజేశ్‌ చంద్ర చెప్పారు. మర్కజ్‌ నిజాముద్దీన్‌ కేసుకు సంబంధిం సెర్చ్‌ ఆపరేషన్‌ చేసిన వారంతా కరోనా బారిన పడ్డారని ఆయన అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడుతున్న కారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని హోం మినిస్ట్రీ అధికారులు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగేలా మంచి ఫుడ్‌ అందించాలని ఆదేశాల జారీ చేశారు.