ఖమ్మం జిల్లాలో ఫలిస్తున్న బడిబాట .. జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లపై ఆఫీసర్ల ఫోకస్

ఖమ్మం జిల్లాలో ఫలిస్తున్న బడిబాట .. జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లపై ఆఫీసర్ల ఫోకస్
  • ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు
  • ఇప్పటి వరకు 5212 మంది స్టూడెంట్స్​ జాయిన్​

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో బడిబాట ఫలితాలనిస్తోంది. మూతబడ్డ గవర్నమెంట్ స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. బడి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్​సక్సెస్​అయింది. గతేడాది జీరో ఎన్​ రోల్ మెంట్ స్కూళ్లుగా రికార్డయిన 64 స్కూళ్లలో ఈ ఏడాది10 స్కూళ్లు రీ ఓపెన్​అయ్యాయి. మరో కొత్త స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకు180 విద్యార్థులు చేరారు. 2024లో జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లుగా నమోదయిన వాటిపై గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పెషల్ ఫోకస్​పెట్టారు.  

ఒకే గ్రామంలో రెండు పాఠశాలలున్న వాటిని ఆయా గ్రామాల్లో విద్యార్థులు లేని వాటిని పక్కనపెట్టారు. మిగిలినవి 22 స్కూళ్లపై దృష్టిసారించిన విద్యాశాఖ అధికారులు, వాటిలో స్టూడెంట్స్​ జాయిన్​ అయ్యేలా చూడడంలో సక్సెస్​అయ్యారు. మళ్లీ ప్రారంభమైన స్కూళ్లలో కల్లూరు మండలంలో నాలుగు ఉండగా, ఏన్కూరు, ఖమ్మం రూరల్​, ఖమ్మం అర్బన్​, పెనుబల్లి, కారేపల్లి, వైరా మండలాల్లో ఒక్కొక్క పాఠశాలలున్నాయి. ఇక రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్​ లో కొత్తగా స్కూల్ ను ఏర్పాటు చేయగా, అక్కడ 40 మంది విద్యార్థులు జాయిన్​ అయ్యారు. 

కలెక్టర్​స్పెషల్ ఇంట్రస్ట్..!

జిల్లా కలెక్టర్ గా ఏడాది పాటు పనిచేసిన ఐఏఎస్​అధికారి ముజమ్మిల్​ఖాన్​గవర్నమెంట్ స్కూళ్లపై స్పెషల్ ఫోకస్​ పెట్టారు. కల్లూరు మండలంలో మూడు జీరో ఎన్​ రోల్ మెంట్ స్కూళ్లలో వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షలు చెక్​ ను కల్లూరు ఆర్డీవోకు అందజేశారు. ఈనెల 11న మూడు స్కూళ్ల పున: ప్రారంభాన్ని కూడా గ్రామంలో పండుగలాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ ను, వారి పేరెంట్స్​ను భాగస్వాములను చేశారు. దీంతో పాటు జిల్లాలోని పాఠశాలల్లో 'వియ్​ కెన్​ లెర్న్​' పేరుతో స్పోకెన్​ ఇంగ్లిష్ తరగతులను, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్​తరగతులను ఏర్పాటుచేశారు.

 ఆయన చొరవతో పాటు విద్యాశాఖ అధికారులు గవర్నమెంట్ స్కూళ్లలో సౌకర్యాల గురించి ఇంటింటి ప్రచారం చేయడంతో బడిబాటలో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగింది.  గతేడాది ఒకరే విద్యార్థిని ఉన్న వైరా మండలం నారపునేనిపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 13కి పెరిగింది.  అక్కడ స్కూళ్లో గతేడాది ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉన్న విషయం వెలుగులోకి రాగా అప్పటి కలెక్టర్​ముజమ్మిల్ ఖాన్​ రూ.6 లక్షలతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దారు.  ఒకే ఒక్క విద్యార్థిని అయిన నాలుగో తరగతి స్టూడెంట్ కీర్తనను ఆ స్కూల్ కు బ్రాండ్​ అంబాసిడర్ గా ప్రకటించి, స్కూల్ గోడలపై కీర్తన ఫోటోను ఆర్ట్ గా వేయించారు.

  రూ.లక్షన్నరతో స్కూల్ ఆవరణలోకి కోతులు రాకుండా సోలార్​ ఫెన్సింగ్, మరో లక్షన్నరతో ప్రత్యేకంగా డ్రాయింగ్ లతో స్కూల్ గోడలను అందంగా మార్చారు. ఇంకో రూ.2 లక్షలతో ఇతర సౌకర్యాలు అభివృద్ధి పనులు, రూ. లక్షతో ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఆ స్కూల్ కు ఇద్దరు టీచర్లను కేటాయించారు. ఇలా మొత్తం 12 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గత కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్ చొరవే కారణమైంది. ​

బడిబాట సక్సెస్​..!

ఖమ్మం జిల్లాలో బడిబాట కార్యక్రమంలో సోమవారం వరకు 5212 మంది విద్యార్థులు గవర్నమెంట్‌ స్కూళ్లలో జాయిన్​ అయ్యారు. 1వ తరగతిలో జాయిన్​ అయిన స్టూడెంట్స్​2349 మంది కాగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 2863 మంది కొత్తగా చేరారు. వీరిలో 910 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి జాయిన్​కాగా, 1953 మంది ఇతర ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. ఈ నెల 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుండడంతో, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.