
వెల్లడించిన హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్
ముంబై: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 557 మంది పోలీసులకు కరోనా సోకిందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ శుక్రవారం ప్రకటించారు. ముంబైలో కేసులు తదితర వివరాలకు సంబంధించి ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. 2,26,236 మందిని క్వారంటైన్లో ఉంచగా.. 653 మంది క్వారంటైన్ రూల్స్ను బ్రేక్ చేశారని అన్నారు. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన 4,729 రిలీఫ్ క్యాంప్స్లో 4,28,734 మంది ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. అక్రమ రవాణా చేస్తున్న 1286 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. “ పోలీస్ హల్ప్ లైన్ 100కి ఇప్పటి వరకు 86,246 కాల్స్ వచ్చాయి. 3,15,434 మందికి ఎమర్జెన్సీ పాసులు జారీ చేశాం. సెక్షన్ 188 కింద 98,774 కేసులను నమోదు చేశాం. ఇప్పటి వరకు 54,148 వాహనాలను సీజ్ చేయగా.. వివిధ కేసుల్లో 19,082 మందిని అరెస్టు చేశాం. సుమారు 3.66 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేశాం” అని అనిల్ చెప్పారు. మహారాష్ట్రలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. 24 గంటల్లో 1362 కొత్త కేసులు నమోదయ్యాయి.