ఒక్క రోజే 6 ఎయిరిండియా డ్రీమ్‌‌లైనర్ ఫ్లైట్లు రద్దు.. టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణం..!

ఒక్క రోజే 6 ఎయిరిండియా డ్రీమ్‌‌లైనర్ ఫ్లైట్లు రద్దు.. టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణం..!
  • లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌‌వేస్‌‌లకు చెందిన మరో రెండు ఫ్లైట్లు కూడా..
  • టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణం
  • విమానాల్లో వెళ్లాలంటే భయందోళనకు గురువుతున్న ప్యాసింజర్లు
  • అంతర్జాతీయ సర్వీసులపైనా ప్రభావం

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అహ్మదాబాద్‌‌ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన మరవకముందే అదే సంస్థకు చెందిన ఆరు బోయింగ్ 787-–8 డ్రీమ్‌‌లైనర్ విమానాలు మంగళవారం ఒక్క రోజే సాంకేతిక సమస్యల కారణంగా రద్దయ్యాయి. దీంతో ఎయిరిండియా పట్ల ప్రయాణికుల్లో తీవ్ర భయందోళనలు మొదలయ్యాయి. అంతేగాక, ఒకేసారి ఆరు విమానాల రద్దు అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రభావితం చేశాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

రద్దయిన సర్వీసులలో ఎయిరిండియా (ఏఐ)-915 (ఢిల్లీ –దుబాయ్), ఏఐ-153 (ఢిల్లీ–-వియన్నా), ఏఐ-143 (ఢిల్లీ–పారిస్), ఏఐ-159 (అహ్మదాబాద్-–లండన్), ఏఐ 133 (బెంగళూరు–లండన్), ఏఐ-170 (లండన్–అమృత్‌‌సర్) ఉన్నాయి. వీటితోపాటు ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ-315 (హాంగ్‌‌కాంగ్–-ఢిల్లీ) డ్రీమ్‌‌లైనర్‌‌లో కూడా టెక్నికల్ సమస్య తలెత్తడంతో పైలట్ ఆ విమానాన్ని హాంగ్‌‌కాంగ్‌‌కు తిరిగి మళ్లించాడు.

ఎయిరిండియా వివరణ 

 ఏఐ-143 (ఢిల్లీ–-పారిస్) విమానంలో ప్రీ-ఫ్లైట్ చెక్స్ సమయంలో ఓ సమస్య బయటపడిందని ఎయిరిండియా తెలిపింది. దాన్ని సరిచేయడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో పారిస్ చార్లెస్ డి గాలె విమానాశ్రయంలో ఉండిపోయిదని వెల్లడించింది. ఇక, అహ్మదాబాద్-–లండన్ గాట్విక్ సర్వీసు అయిన ఏఐ-159  రద్దుకు ఎయిర్‌‌స్పేస్ ఆంక్షలు, అదనపు తనిఖీలు తదితర కారణాలతో  విమానం అందుబాటులో లేదని వివరించింది. 

అందులో ఎలాంటి టెక్నికల్ సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. కేవలం ఎయిరిండియావేగాక.. ఇతర విమానయాన సంస్థలైన లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌‌వేస్‌‌కు చెందిన రెండు డ్రీమ్‌‌లైనర్‌‌లు కూడా టెక్నికల్ ఇష్యూలతో రద్దయ్యాయి. అందులో ఫ్రాంక్‌‌ఫర్ట్–-హైదరాబాద్, లండన్–-చెన్నై రూట్‌‌ విమానాలున్నాయి. ఇవి సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడి నుంచి బయల్దేరాయో అక్కడే ల్యాండ్ అయ్యాయి.

ఇండిగోకు బాంబు బెదిరింపు

టెక్నికల్ సమస్యలతో 6 ఎయిరిండియా విమానాలు రద్దుకాగా.. కొచ్చి నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు  విమానాన్ని నాగ్‌‌పూర్‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​చేసి తనిఖీలు జరిపారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.