హైదరాబాద్, వెలుగు: ఏటీఎం మెషీన్లలో క్యాష్ కొట్టేసిన కస్టోడియన్(క్యాష్ రీఫిల్ చేసే వ్యక్తి)ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీపీ డీఎస్ చౌహాన్ సోమవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్లకు చెందిన పార్థి ప్రణయ్కుమార్(25) సికింద్రాబాద్లోని సెక్యూర్వాల్యూ ఇండియా లిమిటెడ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నాడు. మరో కస్టోడియన్ శ్రీనివాస్తో కలిసి తనకు కేటాయించిన ఐసీఐసీఐ ఏటీఎం మెషీన్లలో క్యాష్ రీఫిల్ చేసేవాడు. ఇందుకోసం సంస్థ ప్రణయ్ కుమార్, శ్రీనివాస్కు వేర్వేరు పాస్వర్డ్స్, కీస్ను అందించింది. ఇద్దరి పాస్వర్డ్స్ఉంటే తప్ప ఏటీఎం మెషీన్ తెరుచుకోదు. ప్రతిరోజు డబ్బును ఏటీఎం మెషీన్లలో రీఫిల్ చేసే ప్రణయ్చోరీలకి స్కెచ్ వేశాడు. రీఫిల్ చేసే క్యాష్లో కొంత మొత్తాన్ని కొట్టేయాలనుకున్నాడు. ఈ నెల 1న మరో కస్టోడియన్ శ్రీనివాస్ డ్యూటీకి రాకపోవడంతో దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. శ్రీనివాస్ ఆఫీస్ సిస్టమ్ నుంచి పాస్వర్డ్స్ను ప్రణయ్ కుమార్ తన సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు.
గంటల వ్యవధిలో 5 ఏటీఎంలలో చోరీ
అదేరోజు పీర్జాదిగూడలోని 2 ఏటీఎం సెంటర్లు, జిల్లెలగూడలో 2, బండ్లగూడలో ఓ ఏటీఎం సెంటర్నుంచి రూ.62 లక్షల 79 వేలు క్యాష్కొట్టేసి పారిపోయాడు. మరుసటి రోజు సెక్యూర్ వాల్యూ సంస్థకు చెందిన ఇతర కస్టోడియన్లు ఆ ఏటీఎంలలో క్యాష్ రీఫిల్ చేసేందుకు వెళ్లారు. మెషీన్లలో తక్కువ డబ్బు ఉండటాన్ని గమనించి మేనేజ్మెంట్కు సమాచారం అందించారు. సెక్యూర్ వాల్యూ నిర్వాహకులు మేడిపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టి ప్రణయ్కుమార్కొట్టేశాడని తేల్చారు. సోమవారం అల్వాల్లోని లోతుకుంటలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.55 లక్షల 6 వేల క్యాష్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్లోనూ ఉప్పల్, పోచారం ఐటీ కారిడార్లోని ఏటీఎం మెషీన్లలో ప్రణయ్ రూ.2 లక్షల 50 వేలు కొట్టేసినట్లు సీపీ చౌహాన్ తెలిపారు. అతడు దొంగిలించిన డబ్బును గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన దొమ్మటి క్రాంతికుమార్ వద్ద దాచి, అవసరాలకు ఖర్చు చేశాడని ఆయన చెప్పారు. క్రాంతికుమార్ను సైతం అరెస్ట్ చేశామన్నారు.