- త్రిపురలో అత్యధికం (68.92%) మహారాష్ట్రలో అత్యల్పం (43%)
- 13 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజక వర్గాల్లో ఎన్నికలు
- ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్
- యూపీలో అత్యల్పం (54.85) 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో శుక్రవారం ఎన్నికల అధికారులు రెండో విడత పోలింగ్ నిర్వహించారు. మొత్తం 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి మృతిచెందడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ నియోజకవర్గ ఎన్నికను రీషెడ్యూల్ చేశారు.
మే 7 న మూడో దశలో ఇక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లో కలిపి 63% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. త్రిపురలో అత్యధికంగా 79.46 % ఓటింగ్ నమోదవగా.. ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 54.85 శాతం ఓట్లు పోలయ్యాయి. కేరళలోని 20 సీట్లు, కర్నాటక 4, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 8 చొప్పున, మధ్య ప్రదేశ్ 7, అస్సాం, బిహార్ 5 చొప్పున, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్ 3 చొప్పున, జమ్మూకాశ్మీర్, మణిపూర్, త్రిపురలో ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. కొన్నిచోట్ల రాత్రి వరకూ సాగింది. మండుటెండలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి
ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అదృష్టాన్ని పరీక్షించుకున్న కీలక నేతలు
రెండో దశపోలింగ్లో కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్, తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ), శశి థరూర్ (కాంగ్రెస్), నటి హేమమాలిని (బీజేపీ), అరుణ్ గోవిల్ (బీజేపీ), తేజస్వీ సూర్య (బీజేపీ), లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.
కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు
కేరళ, బెంగాల్లో ఈవీఎంలో లోపాలు, బోగస్ ఓటర్లకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈవీఎంలలో లోపాలతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వివిధ అంశాలపై యూపీలోని మథుర, రాజస్థాన్లోని బన్స్వారా, మహారాష్ట్రలోని పర్భణిలో జనం పోలింగ్ను బైకాట్ చేశారు. కేరళలోని పాలక్కడ్, అలప్పుజ, మలప్పురంలో ఓటు వేసిన తర్వాత ముగ్గురు మృతిచెందగా, కోజికోడ్లోని బూత్లో ఓ పోలింగ్ ఏజెంట్ కుప్పకూలిపోయి, కన్నుమూశాడు. చత్తీస్గఢలోని గరియాబంద్ జిల్లా మహాసముంద్ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మధ్యప్రదేశ్స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు.
- ఓ చోట వధువు, వరుడితోసహా కుటుంబంలోని మూడు తరాలు ఓటేసేందుకు వచ్చారు.
- ఇంకొన్నిచోట్ల ఎడ్లబండ్లపై, సీనియర్ సిటిజన్లు వీల్ చైర్లో పోలింగ్ స్టేషన్కు తరలివచ్చారు.
- చత్తీస్గఢ్లోని కాంకేర్ నియోజకవర్గం సివ్నీగ్రామంలో పోలింగ్ బూత్ను పెండ్లి మండపంలాగ డెకరేట్ చేశారు. వివాహ ఆచారాలను ప్రదర్శించారు. రాజ్నంద్గావ్, మహాసముంద్ నియోజకవర్గాల్లో వధూవరులు తరలివచ్చి, ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో మహిళలు ఢోలక్ వాయిస్తూ ఎడ్లబండ్లపై పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు.
- రాజస్థాన్లోని కోటా–బుండీ పార్లమెంట్ నియోజకవర్గ గుంజారా పోలింగ్ బూత్లో 108 ఏండ్ల భురీ బాయ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని రీసీలో హజీ కరాందిన్అనే 102 ఏండ్ల వృద్ధుడు ఓటు వేశాడు.
- చేనేత పట్టు వస్త్రాలను ప్రోత్సహించేందుకు చామరాజనగర్ జిల్లాలో 8 మంది మహిళా పోలింగ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా నేసిన చీరలు కట్టుకొని ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
- మహారాష్ట్రలోని అమరావతి పోలింగ్ బూత్కు బీజేపీ క్యాండిడేట్ నవనీత్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాతో కలిసి బైక్పై వచ్చారు.