
- మూసేసిన స్కూల్ కాంపౌండ్లో 751 అస్థిపంజరాలు
- మరోసారి ఉలిక్కిపడిన కెనడా
- రాడార్ సిగ్నల్స్ ద్వారా కనుగొన్న అధికారులు
వాంకోవర్: వందలాది చిన్నారుల అస్థిపంజరాలతో మరోసారి కెనడా దేశం ఉలిక్కిపడింది. ఇప్పటికే కెనడాలోని ఓ మూసి ఉన్న స్కూల్లో 200కు పైగా అస్థిపంజరాలు బయటపడగా తాజాగా మూతపడ్డ మరో స్కూల్లోనూ 751 అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు. సస్కట్చువాన్ ప్రావిన్స్లోని కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలో ఉన్న మరివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ కాంపౌండ్లో జరిపిన రాడార్ పరీక్షలో ఈ విషయం బయటపడింది. రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో 1899 నుంచి 1997 మధ్య ఈ స్కూల్ నడిచింది. గత నెలలోనూ బ్రిటిష్ కొలంబియాలోని కామ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో దేశంలోని మూసేసిన స్కూళ్లలో సెర్చింగ్ మొదలుపెట్టగా ఈ మరివల్ స్కూల్ సంఘటన బయటపడ్డది.
19వ శతాబ్దంలో..
1900 శతాబ్దం నుంచి 1970 వరకు కెనడాలో లక్షన్నర మందికి పైగా చిన్నారులను క్రిస్టియన్ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో చాలావరకు రోమన్ కాథలిక్ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. స్కూళ్లలో చిన్నారులను ఫిజికల్గా, సెక్సువల్గా వేధించారని, తమ లోకల్ భాష మాట్లాడితే పిల్లల్ని తీవ్రంగా కొట్టేవారని కెనడా సర్కారు కూడా ఇటీవల అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6 వేల మంది చనిపోయి ఉంటారని అంచనా. కెనడా స్కూళ్లలో పిల్లలపై జరిగిన దారుణాలను బయటపెట్టేందుకు నేషనల్ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ 2008లో ఏర్పాటైంది. 1883 నుంచి 1996 మధ్య కెనడాలోని 150 స్కూళ్లలో లక్షా 50 వేల మంది చేరారని, కానీ వాళ్లలో సుమారు 4,100 మంది కనిపించకుండాపోయారని ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. కాగా, ఈ విషయం తెలిసి తన గుండె బద్దలైందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు.