మహారాష్ట్రలో దారుణం జరిగింది. రైలు ప్రయాణికురాలిపై దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. యూపీలోని లక్నో నుంచి ముంబై వెళ్తున్న రైలులోకి శుక్రవారం రాత్రి 8 మంది దొంగలు ఆయుధాలతో ఇగత్ పురి పట్టణం వద్ద రైలు ఎక్కారు. రైలు బయలుదేరిన కాసేపటికే ఆయుధాలతో బెదిరించి దోపిడీ మొదలుపెట్టారు. అదే సమయంలో ఓ ప్రయాణికురాలి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోచ్లో ఉన్న ప్రయాణికుల నుంచి డబ్బులు, బంగారం దోచుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులపై కూడా దాడి చేశారు.
అయితే రైలు కాసరా స్టేషన్ వద్దకు చేరుకోగానే.. ప్రయాణికులు గట్టిగా అరిచారు. దాంతో అప్రమత్తమైన స్టేషన్ పోలీసులు.. కోచ్ వద్దకు చేరుకొని ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. వారిని విచారించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్టయిన దొంగల నుంచి రూ. 34 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
For More News..