కేసీఆర్ కు​ మద్దతుగా 9 పంచాయతీల తీర్మానం

కేసీఆర్ కు​ మద్దతుగా 9 పంచాయతీల తీర్మానం

కామారెడ్డి, వెలుగు:   అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం కేసీఆర్​కే తమ ఓట్లన్నీ  వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్లు కేసీఆర్ ​ప్రకటించిన నేపథ్యంలో,  తమ  పంచాయతీ పరిధిలోని ప్రజలు మొత్తం కేసీఆర్​కే ఓటు వేస్తామని మాచారెడ్డి మండలంలోని  8, పాల్వంచ మండలంలో  ఓ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశాయి. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట,   అంకిరెడ్డిపల్లి తండా, వెనుకతండా, నడిమితండా,  నెమ్లిగుట్ట తండా, బొడిగుట్ట తండా, మైసమ్మ చెరువు తండా, రాజ్​ఖాన్​పేట, పాల్వంచ మండలంలోని మంథని దేవునిపల్లి పంచాయతీ పాలక వర్గాలు తీర్మానాలు చేశాయి. 

పంచాయతీ లెటర్​హెడ్​పై కేసీఆర్ కు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు రాసి సర్పంచులు, ఉప సర్పంచులు సంతకాలు చేశారు. అంతకుముందు ఆయా చోట్ల ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్​రావు,  జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.  కాగా,  సిద్దిపేట రూరల్​ మండలం రాంపూర్​లో కూడా బీఆర్​ఎస్​కే ఓట్లు వేస్తామని అక్కడి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

పార్టీ తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చెప్తరు?

బీఆర్ఎస్ పార్టీ చేసే తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చూపుతారని కాంగ్రెస్​మాచారెడ్డి  మండల ప్రెసిడెంట్​గణేశ్​నాయక్​  ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలతో వారు ముందుకెళ్తారన్నారు. గ్రామం మొత్తం బీఆర్ఎస్​కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తోందని తీర్మానించడం కరెక్ట్​కాదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామన్నారు.