
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ నర్సులు ఇటీవల మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వహించిన ఎగ్జామ్లో ఉత్తీర్ణత చెంది, రెగ్యులర్ నర్సింగ్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నర్సులు సంబరాలు నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో మొత్తం 260 మంది నర్సింగ్ సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తుండగా.. ఇందులో 90 మందికి పైగా నర్సింగ్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. తమను రెగ్యులర్ చేయమని చాలా కాలంగా పోరాడుతున్న తమకు అన్ని విధాల సహకరించి, పర్మినెంట్ జాబ్స్ వచ్చేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎం.రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మలకు నర్సులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సబితారెడ్డి, లక్ష్మీ, ఇందిర, ధనలక్ష్మీ, సరళ, సుజాత తదితరులు పాల్గొన్నారు.