
న్యూఢిల్లీ: టారిఫ్ల భారాన్ని తగ్గించుకునేందుకు యూఎస్లో అమ్మే దాదాపు అన్ని ఐఫోన్లను చైనా నుంచి కాకుండా ఇండియా నుంచి యాపిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది మార్చి–-మే మధ్య ఫాక్స్కాన్ ఇండియా ఎగుమతి చేసిన ఐఫోన్లలో దాదాపు అన్నీ (97 శాతం) అమెరికాకు వెళ్లాయి. ఇది 2024లో సగటున ఎగుమతి అయిన 50.3 శాతం వాటాతో పోలిస్తే చాలా ఎక్కువ.
చైనాపై యూఎస్ విధించిన భారీ టారిఫ్లను బైపాస్ చేయడానికి యాపిల్ ఈ స్ట్రాటజీ వాడుతోంది. ఈ ఏడాది మార్చి–-మేలో ఫాక్స్కాన్ ఇండియా 3.2 బిలియన్ డాలర్ల (రూ.27,520 కోట్ల) విలువైన ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. ఇందులో 97 శాతం అమెరికాకు వెళ్లాయి. మే లో యూఎస్కి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్స్ను రవాణా చేసింది. ఇది మార్చిలో 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో ఫాక్స్కాన్ ఇప్పటికే 4.4 బిలియన్ డాలర్ల (రూ.37,840 కోట్ల) విలువైన ఐఫోన్స్ను అమెరికాకు షిప్ చేసింది. 2024 మొత్తం సంవత్సరంలో 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. కాగా, ఇండియా ప్రొడక్షన్ చేపట్టొద్దని ఈ ఏడాది మే నెలలో ట్రంప్ యాపిల్కు సూచించిన విషయం తెలిసిందే.