- మహిళను చంపిన బంధువులు
- నగలు చోరీ చేసిందనే అనుమానంతో హత్య
- ఉత్తరప్రదేశ్లో దారుణం
ఘజియాబాద్: ఇంట్లో నగలు చోరీ చేసిందనే అనుమానంతో 23 ఏండ్ల మహిళను బంధువులే చిత్ర హింసలు పెట్టారు. ఆమె శరీర భాగాలను బ్లేడ్తో కోశారు. కర్రలు, రాడ్లతో కొట్టారు. నగలు ఎక్కడ దాచావంటూ నరకం చూపించారు. ఆమె పెట్టే కేకలు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు నిందితులు ఫుల్ వాల్యూమ్తో మ్యూజిక్ ప్లే చేశారు. దెబ్బలకు తాళలేక ఆ మహిళ చనిపోవడంతో వారంతా పరారయ్యారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ దారుణం జరిగింది. రెండ్రోజులుగా వస్తున్న మ్యూజిక్ సౌండ్ భరించలేక పక్కింటివాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఈ విషయం బయటపడింది.
అరుపులు వినపడొద్దని మ్యూజిక్ ప్లే చేసిన్రు సమీనా(23) సోమవారం ఘజియాబాద్లోని సిద్ధార్థ్ విహార్లో ఉండే తన బంధువులు హీనా, రమేశ్ దంపతుల కొడుకు బర్త్డే పార్టీకి హాజరైంది. వేడుక పూర్తయ్యేసరికి ఇంట్లో ఉన్న రూ.5 లక్షల విలువైన నగలు మాయమయ్యాయి. సమీనానే ఆ నగలు తీసిందనే అనుమానంతో రమేశ్ దంపతులు మరికొందరితో కలిసి కర్రలు, రాడ్లతో ఆమెను చావబాదడం మొదలు పెట్టారు. బ్లేడ్తో కోశారు. మ్యూజిక్ ప్లే చేయడంతో ఆమె అరుపులు బయటివాళ్లకు వినిపించలేదు. చిత్రహింసలు తట్టుకోలేక ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో నిందితులు మ్యూజిక్ అలాగే ఉంచి పరారయ్యారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.