
బెళగావి: పిల్లలు పుట్టరనే కారణంతో కట్టుకున్న భార్యనే భర్త కడతేర్చిన ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ హత్యలో ఆ వివాహిత అత్తమామ కూడా ఉండటం శోచనీయం. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటంటే.. కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన సంతోష్.. మహారాష్ట్రలోని సాతారాలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. 2020లో రేణుక అనే యువతితో అతనికి వివాహం జరిగింది. రేణుక ప్రాక్టీసింగ్ డాక్టర్. ఈ భార్యాభర్తలు మాత్రమే కాదు వీరి కుటుంబాలు కూడా ఉన్నత చదువులు చదువుకుని ఆర్థికంగా గొప్పగా స్థిరపడిన వాళ్లే. పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో గొడవలు జరిగాయి.
రేణుకకు అనారోగ్య సమస్యలతో పాటు పిల్లలు పుట్టరన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ కారణంతో ఆమెకు భర్త, అత్తమామలు నరకం చూపించారు. సూటిపోటి మాటలతో వేధించడమే కాదు శారీరకంగా కూడా కొట్టి వేధింపులకు గురిచేశారు. భార్యకు పిల్లలు పుట్టరని తెలిశాక సంతోష్ గుట్టు చప్పుడు కూడా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. సంతోష్ రెండో భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఎన్ని వేధింపులకు గురిచేసినా రేణుక మౌనంగా భరించిందే తప్ప పుట్టింటికి వెళ్లలేదు. ఎంత టార్చర్ చేసినా రేణుక ఎక్కడికీ వెళ్లేలా లేదని భావించిన ఆమె భర్త, అత్తమామలు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రేణుకను చంపేసి ఆమె అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యారు.
మే 18న రేణుక హత్యకు ప్లాన్ చేశారు. రేణుకను ఆమె అత్త జయశ్రీ గుడికి వెళ్లొద్దామని తీసుకెళ్లింది. జయశ్రీ భర్త బైక్ నడుపుతున్నాడు. వెనుక అత్తాకోడలు కూర్చున్నారు. గుడికి వెళ్లి తిరిగొచ్చే సమయానికి రాత్రయింది. ముగ్గురూ బైక్ పై తిరిగొస్తుండగా.. రేణుకను బైక్పై నుంచి ఆమె అత్త తోసేసింది. ఆ తర్వాత రాయితో కోడలిపై జయశ్రీ దాడి చేసింది. ఆ తర్వాత జయశ్రీ భర్త, రేణుక మామ.. రేణుకను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత జయశ్రీ, ఆమె భర్త కలిసి రేణుక మృతదేహాన్ని బైక్కు కట్టి100 మీటర్లు ఈడ్చుకెళ్లారు. జరిగిందంతా యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రేణుక చీర బైక్ చక్రంలో చిక్కుకుని ఆమె కిందపడిపోయిందని, గాయాల పాలై చనిపోయిందని కట్టు కథ అల్లారు. పోలీసులకు కూడా ఇదే చెప్పారు.
అయితే.. రేణుక తల్లిదండ్రులు ఆమె భర్తపై, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కోసం వేధించారని, గొడ్రాలని సూటిపోటి మాటలతో నరకం చూపించి.. చివరకు చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని రేణుక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా విచారించగా.. రేణుకను చంపింది ఆమె అత్తమామలేనని, ఆమె భర్తనే ఈ హత్యకు ప్లాన్ చేశాడని తేలింది. పోలీసులు రేణుక భర్తను, ఆమె అత్తమామలను అరెస్ట్ చేశారు.