- టీ షర్ట్ చింపుకొని పోడు రైతులపై ఫిర్యాదు
- ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నిర్వాకం
ఖమ్మం, వైరా, వెలుగు: పోడు రైతులను ఇబ్బంది పెట్టేందుకు తనకు తానుగా టీషర్ట్ చింపుకొని, పోడు సాగును ఆపినందుకు తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడో అటవీ శాఖ బీట్ ఆఫీసర్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో మంగళవారం పోడు భూముల్లో ఎద్దులతో దుక్కి దున్నుతున్న కొంత మంది రైతులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బంది, స్థానిక గిరిజనులకు మధ్య కొంత వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సమయంలో బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్నాయక్ తన టీషర్ట్ తానే చింపుకోవడం స్థానికులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. తర్వాత ఉద్రిక్తత సద్దుమణగ్గా..పోడు సాగును అడ్డుకున్నందుకు తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు బీట్ ఆఫీసర్ కంప్లయింట్ చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని కొణిజర్ల పోలీసులు చెబుతున్నారు. గతేడాది ఇదే ఎల్లన్ననగర్లో 22 మంది తమపై దాడి చేశారంటూ అటవీ శాఖ సిబ్బంది కంప్లయింట్ చేయగా, పోలీసులు హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, ముగ్గురు బాలింతలతో పాటు పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మళ్లీ అదే గ్రామంలో తాజాగా పోడు గొడవ జరిగింది.