
కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. శ్రీసాయి కాలనీ దగ్గర ఉదయం పారిశుధ్య పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుడిని కారు ఢీ కొట్టింది. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీహెచ్ఎంసి సర్కిల్ గాజులరామారాంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న శాంతారావు(39) ఉదయం బుల్లెట్ షోరూం పక్కన విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు పక్కన చెత్త తీస్తున్నాడు. ఇంతలోనే.. నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చిన కారు కార్మికుడి పైకి దూసుకెళ్లింది. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.