- కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై షబ్బీర్అలీ ఆరోపణ
- చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే
- కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను
- అడ్డుకున్న పోలీసులు
- క్యాంప్ ఆఫీస్లో వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్
- కారులో క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ కాంగ్రెస్ నేత
- కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టిన బీజేపీ లీడర్లు
కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూములను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అమ్ముకున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించడం, చర్చకు రావాలని ఎమ్మెల్యే చేసిన సవాల్ను కాంగ్రెస్ లీడర్లు స్వీకరించడంతో హైటెన్షన్ నెలకొన్నది. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీస్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.
ఇదే సమయంలో ఓ కాంగ్రెస్ నాయకుడు కారులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు రావడంతో.. ఆ కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించారని షబ్బీర్అలీ ఆరోపించారు.
దీంతో డిగ్రీ కాలేజీ, అరోరా ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించిన భూముల ఆరోపణలపై సాక్ష్యాధారాలు తీసుకొని శనివారం శిశుమందిర్ స్కూల్ వద్దకు రావాలని వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్ను కాంగ్రెస్ నాయకులు స్వీకరించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు శనివారం శిశు మందిర్ స్కూల్ ఏరియాకు వస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి శిశు మందిద్ వద్దకు వెళ్లకుండా ఆయన్ని క్యాంప్ ఆఫీస్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు, పోశానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేంద్రెడ్డి తన కారులో క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు వచ్చి.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కారు అక్కడే ఉండడంతో బీజేపీ నాయకులు కారును పల్టీ కొట్టించి.. ధ్వంసం చేశారు. స్పందించిన పోలీసులు కారును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా బీజేపీ నాయకులు మరోసారి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొందరు బీజేపీ నాయకులు ఆ కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు మంటలను ఆర్పివేసి అక్కడి నుంచి కారును తరలించారు. పోలీసులు తీసుకెళ్లిన బీజేపీ కార్యకర్తను తమకు అప్పగించాలని ఆ పార్టీ లీడర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మద్య తోపులాట జరిగింది.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నాయకులకు నచ్చజెప్పారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడి కారును ధ్వంసం చేయడంతోపాటు నిప్పు పెట్టిన వ్యవహారంలో ఇద్దరు బీజేపీ నాయకులతోపాటు కాంగ్రెస్ నాయకుడు మహేందర్రెడ్డిని సైతం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
రేపు కలెక్టరేట్కు వస్తా: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి డిగ్రీ కాలేజీకి సంబంధించిన గజం భూమి అమ్మినట్టు, అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంపై సోమవారం కామారెడ్డి కలెక్టరేట్కు వస్తానని, కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్ల సమక్షంలోనే భూముల డాక్యుమెంట్లు పరిశీలిద్దామన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కలెక్టరేట్కు వచ్చి అక్రమాలను నిరూపిస్తే అక్కడికక్కడే తన పదవిని రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
ఒక వేళ సీఎం రేవంత్రెడ్డి రమ్మని పిలిస్తే క్యాంప్ ఆఫీస్కు వస్తానని, అక్కడైనా ఆధారాలతో నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు సీఎం కాళ్లు మొక్కి వస్తానని అన్నారు. కామారెడ్డి క్యాంపు ఆఫీస్లో వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలేజీ భూములను తన తండ్రితో పాటు ఇతర సొసైటీ ప్రతినిధులు కాపాడారని చెప్పారు. 263 ఎకరాల భూమిని విద్యా సంస్థల ఏర్పాటుకు, ప్రభుత్వ ఆఫీసులకు ఇచ్చారని, మిగిలిన 100 ఎకరాలకుపైగా భూమిని ప్రభుత్వానికి అప్పగించారని వెల్లడించారు.
విద్యాభివృద్ధి కోసం ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కావాలనే 28 ఎకరాల భూమిని అరోరా కాలేజీకి కేటాయించారన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం రమేశ్ వాళ్ల కుటుంబ సభ్యులతో ఓ సొసైటీ ఏర్పాటు చేసి బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారని, వారు ఇచ్చినవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలిందని, దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నదని చెప్పారు. ఈ భూముల వ్యవహారంలో తాను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు.
కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే తమ దగ్గర ఉన్న అన్ని రికార్డులను రెవెన్యూ ఆఫీసర్లకు అప్పగించినట్టు చెప్పారు. తనపై ఆరోపణలు చేయడంతోపాటు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై ఈగ వాలినా అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రేపటి నుంచి తాను గ్రామాల్లో పర్యటిస్తానని, ఎక్కడ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. ప్రస్తుతం చూపించింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అన్నారు. షబ్బీర్ అలీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు ఓడిపోయారని, ప్రొటోకాల్ లేకున్నా సలహాదారు పదవితో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
