చిత్తూరు జిల్లా పలమనేరు ఏనుగు హల్ చల్ చేసింది. వీ కోట మండలం గోనుమాకులపల్లిలో ఏనుగు రాకతో గ్రామస్తులు పరుగులు పెట్టారు. రఘుపతి అనే రైతు పొలంలో ఓ ఆవుపై దాడి చేసింది. పొలంలోని పశువుల షెడ్డులోని ఆవును దూరంగా విసిరి పారేసింది. ఈ ఘటనలో ఆవు మృతి చెందింది.
రైతుకు చెందిన పంటపొలాలను ఏనుగు పూర్తిగా ధ్వంసం చేసింది. ఆవు మృతి చెందడంతో పాటు పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి ఎప్పుడు ఏనుగులు వస్తాయోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.