
మమకారం ఆత్మ సాధనకు మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. అదే చైతన్య స్థాయిని పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. అసలు చైతన్య స్థాయి అంటే ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
మనం ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తుంటాం. ఆ విషయంకాని.. ఆ సమస్య కాని పరిష్కారమయ్యేందుకు అదే పని.. ఇలా - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవడాన్ని చైతన్య స్థాయి అంటారు. అంటే మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా ... మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం అని అర్ధమవుతుంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనలో చాలా మందికి వారి వారి స్థాయిల్లొ ... కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ.. - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు.
కేవలం భార్య, భర్త, పిల్లలు... ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ వీరిని దాటి పైస్థాయికి వెళ్లడంలేదు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది. స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనే వుండదు.
మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు... ధనాన్ని పంచుకోవటం కావొచ్చు... జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు... ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.
చాలామంది తమ కుటుంబమే కాకుండా... ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా... సమాజము... గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం.... సమాజ సేవ మొదలగు ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పై స్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటారు.
మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ... మానవ చైతన్య వ్యాప్తి ... అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తాం కదా..! అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం దుఃఖపడతాం... వాళ్ళకోసం ప్రార్దిస్తాం... అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే ... మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ... ఈ మధ్య భారత దేశం అంతా తనలోనే ఉందని....తాను అంతా .. భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నదని చెప్పారు. తరువాత కొద్ది రోజులకు ఇప్పుడు మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా తనలోనే ఉన్నట్టు... తాను ప్రపంచమంతా ఉన్నట్టుగా... అనిపిస్తుందని వివేకానందుడు తన సహచరునితో చెప్పాడు.
అంటే ప్రజలందరిలోనూ... ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుందని వివేకానందుడు చెప్పారు. భగవంతుడు సృష్టించబడిన అన్ని జీవులపై అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది. ఈ దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు ... అని చెప్పారట.
దీనిలో చాలా అర్ధం వుంది. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తు పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం. సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు..
ప్రజలను వారి భౌతిక శరీర పరిధుల గుర్తింపులనుంచి తమలోనే ఉన్న మరొక లోతైన పార్శ్వం దిశగా మళ్ళించగలిగితే, నేను-నువ్వు అనే భేదభావం తగ్గి, ఇద్దరూ ఒక్కటే అన్న భావన కలుగుతుంది. అంటే చైతన్య స్థాయికి ఎదిగామని అర్దం. నిజానికి మనం చైతన్య స్థాయిని పెంచుకోలేము. కాని అనుభవాన్ని పెంచుకుంటాము. అనుభవం పెరిగే కొద్ది ... మరింత చైతన్యవంతులౌతారు. మనందరం ఎంతో కొంత చైతన్యవంతులమే... ఎవరు ఏ స్థాయిలో చైతన్యవంతులుగా ఉన్నరన్నదే ప్రశ్న. మీ చైతన్యాన్ని ఒడిసి పట్టుకునే విధంగా ఎదుగుతూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ పరిధి పట్ల ఉన్న చైతన్య స్థాయి విస్తరిస్తుందని గ్రహించాలి.