వెల్దుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు చనిపోయాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైన కిషన్(42) ఉదయం 7 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు హరీశ్ పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్ స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ షాక్ తగిలి తండ్రి పడి ఉండడం గమనించాడు. పక్కనే ఉన్న రైతులను పిలిచి చూడగా, అప్పటికే కిషన్ చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
