సుజాతనగర్, వెలుగు: పోలీసులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆందోళనకు గురై ఓ రైతు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన సాదం కృష్ణయ్య, సాదం రామయ్య అన్నాతమ్ముళ్లు. ఆస్తి పంపకాల్లో ఎకరం వ్యవసాయ భూమిలో తమ్ముడైన సాదం రామయ్యకు రెండు కుంటలు తక్కువగా వచ్చిందని ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాదం రామయ్య భార్య నాగమణి సాదం కృష్ణయ్య, అతని కొడుకు నరసింహారావుపై సుజాతనగర్ పోలీసు స్టేషన్ లో వారం క్రితం ఫిర్యాదు చేసింది. అనంతరం ఇరుకుటుంబాలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నారు. పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుని ఈ నెల 24న వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు తమ ఇంటివద్దకు వచ్చి రూ. ఐదు వేలు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని బెదిరించారంటూ నరసింహారావు సుజాతనగర్ ప్రధాన రహదారిపై భార్య, నలుగురు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల వెలిగిస్తున్న క్రమంలో స్థానికులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని స్టేషన్ కి తరలించారు.
పాస్బుక్ ఇవ్వాలని..
నర్మెట, వెలుగు: జనగామ జిల్లా నర్మెట మండలం గండి రామారం దొంగల చెలిమతండాకు చెందిన శ్రీరాములు భూమి పట్టా పాస్బుక్ కోసం తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకున్నారు. పాస్బుక్ వచ్చినా ఇవ్వకుండా కొందరు అడ్డుపడుతున్నారని కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్సీసా, పురుగుల మందు డబ్బాతో శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.