- తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం
- కాలిపోయిన సామగ్రి
శంషాబాద్, వెలుగు : చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. శంషాబాద్లోని దేవా ఫుట్ వేర్ కాంప్లెక్స్ లో శనివారం తెల్లవారు జామున 2:30 గంటలకు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లోని గోడౌన్ కు మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాప్లోని సరుకు కాలిపోయింది.
ఫుట్వేర్ షాప్ ఓనర్ మోహన్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 10 గంటలకు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లాలని, తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ వ్యక్తి ఫోన్ చేసి కాంప్లెక్స్లో మంటలు వస్తున్నాయని చెప్పాడన్నారు. చాలా రోజులుగా కాంప్లెక్స్ పక్కనున్న ట్రాన్స్పార్మర్లో కరెంట్ హెచ్చుతగ్గులు వస్తుందని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. దసరా, దీపావళి పండుగల సేల్ కోసం తెచ్చిన దాదాపు రూ. 30 లక్షల సరకు పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.