మేనకోడల్ని బురదలో ముంచి చంపిండు

మేనకోడల్ని బురదలో ముంచి చంపిండు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నాలుగేండ్ల చిన్నారిని మేనమామ బురదలో ముంచి చంపేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన గుజరాతి రాజు, సంతోష భార్యాభర్తలు. బద్దిపడగలో మామిడి తోటను లీజుకు తీసుకుని అక్కడే ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం వీరి కూతురు శిరీష(4) తోటలో ఆడుకుంటుండగా మేనమామ కాలయ శ్రీను అక్కడికి వచ్చి, చిన్నారిని బలవంతంగా లాక్కెళ్లాడు. దగ్గర్లోని వరి పొలంలోని బురదలో శిరీషను ముంచి చంపేశాడు.

పాప అరుపులు విన్న సమీపంలోని రైతులు అక్కడి చేరుకోగా, శ్రీను పారిపొయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకుని రాజగోపాలపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ శ్రీను, ఎస్సై భాస్కరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనుకు మతిస్థిమితం సరిగాలేనట్లు తెలుస్తోంది.