
- సినీ నటి స్వాతి దీక్షిత్ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు
పంజాగుట్ట, వెలుగు : రూ.30 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన సినీ నటి స్వాతి దీక్షిత్ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అమెరికాలో ఉండే మాధురికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 58లో 1,100 గజాల స్థలంలో ఇల్లు ఉంది. మొదటి అంతస్తులో ఆమె బంధువులు ఉండగా.. కింద ఫ్లోర్లో కాఫీ షాప్ ఏర్పాటు చేసేందుకు సినీనటి స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ యూఎస్ఏలోని మాధురిని సంప్రదించారు. లీజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు ఒప్పుకొన్నారు. కానీ చివరకు చేసుకోలేదు.
ALSO READ : ఇన్నోవా హైక్రాస్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది..
ఇదిలా ఉండగా తమకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ ఈనెల 20న స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ మరికొందరితో కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మెయిన్ గేట్ను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వాచ్ మెన్ దంపతులను బెదిరించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్తో పాటు మరి కొంతమందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.