
హైదరాబాద్, వెలుగు : ఓ భారీ సైజ్ రాబందు మాంజాకు చిక్కుకుని విలవిల్లాడుతుండగా వారియర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కాపాడారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్లోని సరూర్నగర్ లేక్ సమీపంలో మాంజా చుట్టుకుని రాబందు గాయంతో విలవిల్లాడుతోందని చూసినవాళ్లు సమాచారమివ్వగా సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మాంజాను తొలగించి రాబందును కాపాడారు. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన రాబందు అని సొసైటీ సభ్యుడు ప్రదీప్ తెలిపారు. గతంలో పార్శిగుట్ట వద్ద కళేబరాలను తినేందుకు ఇలాంటి భారీ సైజ్ రాబందులు వచ్చేవని ఆయన వెల్లడించారు.
పార్శీలు చనిపోయిన తమ వర్గానికి చెందిన మృతదేహాలను ఇక్కడి గుట్టపై ఉన్న బావి దగ్గర పెట్టేవారని, రాబందులు వచ్చి వాటిని తినేవని, అందుకే ఆ ప్రాంతానికి పార్శీగుట్టగా పేరు వచ్చిందని చెప్పారు. చలికాలంలో హైదరాబాద్కు వలస వచ్చే ఈ పక్షులు ఇప్పుడు కనుమరుగయ్యాయని, తాజాగా హైదరాబాద్లో ఈ తరహా రాబందు కనిపించడం విశేషమని అన్నారు. వివిధ రకాల పక్షులను రక్షించడమే లక్ష్యంగా తమ సొసైటీ చేస్తుందని ప్రదీప్తెలిపారు. పక్షులకు గాయాలైనా, ఇతర కారణాలతో అవి ఇబ్బందులు పడటం కనిపించినా వెంటనే తమ సొసైటీ నంబర్ 9697887888 కు ఫోన్ చేయాలని సూచించారు. పక్షుల కోసం తమ సొసైటీ అమీన్ పూర్లో ప్రత్యేంగా ఒక హాస్పిటల్ను నిర్వహిస్తోందని తెలిపారు. గాయాలపాలైన పక్షులకు ఆస్పత్రిలో చికిత్స చేసి తర్వాత వాటిని విడిచి పెడతామని చెప్పారు.