
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో.. బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో బూస్టర్, అదనపు డోసుల పంపిణీ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని కొవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డా.ఎన్కె అరోరా వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 44 కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బూస్టర్, అదనపు డోసుల పంపిణీ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని తీసుకురానుంది. ఎవరికి ఈ డోసులు అవసరం? ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తదితర విషయాలను ఇందులో పొందుపర్చనుంది. ప్రస్తుతం కొత్త వేరియంట్ కూడా వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అరోరా చెప్పారు.