ఓ చిన్నారి 58 నిమిషాల్లో 46 వంటకాలు చేసి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. చెన్నైకి చెందిన ఎస్.ఎన్. లక్ష్మి సాయి శ్రీ ఈ ఘనత సాధించింది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని.. తన తల్లి దగ్గర వంట నేర్చుకుందీ చిన్నారి. వంట చేయడం పట్ల చిన్నారికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. చిన్నారికి వంటలు నేర్పాలని నిర్ణయించుకున్నారు. అయితే చిన్నారికున్న ఈ హాబీతో రికార్డు సృష్టించాలని పాప తండ్రి అనుకున్నాడు. ఈ రికార్డు గురించి పాప తండ్రి ఇంటర్నెట్లో శోధించగా.. కేరళకు చెందిన పదేళ్ల అమ్మాయి సాన్వి సుమారు 30 వంటలు వండి.. రికార్డు నెలకొల్పినట్లు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును లక్ష్మి సాయి చేత బ్రేక్ చేయించాలని తండ్రి భావించాడు. అందుకోసం తన భార్య చేత కూతురుకి వంట చేయడంలో శిక్షణ ఇప్పించాడు. దాంతో బాలిక ఫాస్ట్గా వంట చేయడం నేర్చుకుంది. మంగళవారం యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో లక్ష్మి సాయి 58 నిమిషాల్లో 46 వంటకాలు చేసి రికార్డు బ్రేక్ చేసింది.
ప్రపంచ రికార్డు సృష్టించిన లక్ష్మి సాయి శ్రీ మాట్లాడుతూ.. తాను తన తల్లిని చూసి వంట పట్ల ఆసక్తి పెంచుకున్నానని తెలిపింది. ‘నేను నా తల్లి నుంచి వంట నేర్చుకున్నాను. నేను ఈ మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని లక్ష్మి తెలిపింది.
లాక్డౌన్ సమయంలో తన కుమార్తె వంట చేయడం ప్రారంభించిందని లక్ష్మి తల్లి కలైమగల్ తెలిపారు. పాప బాగా వంట చేస్తుండటంతో.. లక్ష్మి చేత ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నం చేద్దామని తన భర్త సూచించారని ఆమె తెలిపారు. ‘నేను తమిళనాడు యొక్క విభిన్న సాంప్రదాయ వంటకాలను వండుతుంటాను. లాక్డౌన్ సమయంలో.. నా కుమార్తె నాతో పాటు వంటగదిలో గడిపేది. వంటచేయడం పట్ల పాపకున్న ఆసక్తి గురించి నా భర్తతో చర్చించినప్పుడు.. లక్ష్మి చేత ప్రపంచ రికార్డులో ప్రయత్నం చేద్దామన్నారు’ అని కలైమగల్ తెలిపారు.
For More News..